కడప జిల్లా మాజీ మంత్రితో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ!

  • ఇటీవల వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  • కడప జిల్లా ఖాజీపేటలో డీఎల్ రవీంద్రారెడ్డితో భేటీ
  • భవిష్యత్ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ
వైసీపీ నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసే రవీంద్రారెడ్డితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకపాటిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమని వైసీపీ నేతలు హెచ్చరించడం, బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని మేకపాటి సవాల్ చేయడంతో ఉదయగిరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఈ క్రమంలో తన సోదరుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. తన అన్న రాజకీయంగా ఎదగడానికి, కుటుంబం కోసం తాను ఎంతో మందితో గొడవపడ్డానని చెప్పారు. అధికారం ఎక్కడ పోతుందోనని.. ఆయన ఒక టీమ్‌ను పెట్టుకున్నారని.. ప్రస్తుత గొడవలకు రాజమోహన్‌రెడ్డి సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అన్నదమ్ములు ఉంటారనుకోలేదని.. ‘భలేగా ఉందయ్యా అన్నదమ్ముల యవ్వారం’ అని అందరూ చర్చించుకుంటున్నారని వాపోయారు.

mekapati chandrasekhar reddy
dl ravindra reddy
udayagiri mla
Kadapa
YSRCP
Mekapati

More Telugu News